అమరావతి/ వెలగపూడి సచివాలయం : దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు కూటమి ప్రభుత్వం అంద చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు, అర్హులైన వారు నవంబర్ 25వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రధానంగా దివ్యాంగుల కోసం తమ కూటమి సర్కార్ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందన్నారు.
ఇందుకు సంబంధించి రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఆపై ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు ,కనీసం 10 వతరగతి పాసై స్వయం ఉపాధితో జీవించే వారు, 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసు ఉండి, 70 శాతం అంగవైకల్యం గలవారు, డ్రైవింగ్ లైసైన్స్ ఉన్న వారు ఈసైకిళ్లను పొందేందుకు అర్హులని మంత్రి శ్రీ వీరాంజనేయ స్వామి తెలిపారు. మరిన్ని వివరాలకు www.apdascac.ap.gov.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు.















