CM Revanth Reddy : హైదరాబాద్ : మొంథా తుపాను వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆయన అత్యవసర సమీక్ష చేపట్టారు. ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు. వరద ప్రభావత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సూచించారు సీఎం.
CM Revanth Reddy Comments
వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం, హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామగ్రిని వినియోగించాలని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎక్కడైనా ఇండ్ల కప్పులు, బంగ్లాల్లో చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా అవసరమైన ఆహారం, మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు.
పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తతతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు తలపెట్టిన వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిపారు సీఎం. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read : MLA Komatireddy Shocking Comments : కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు


















