CM Revanth Reddy : హైదరాబాద్ : కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్న కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సు దగ్ధం ఘటన కు సంబంధించి సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డితో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్ ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు.
CM Revanth Reddy Meet
మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా ఈ ఘటన 24 వ తేదీ అర్ధరాత్రి 3 గంటల నుంచి 3.30 గంటల మధ్యలో జరిగింది. వేగంగా వెళుతున్న వోల్వో బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో బస్సుకు నిప్పులు అంటుకున్నాయి. చూస్తూ ఉండగానే బస్సు దగ్ధమైంది. మొత్తం ఈ బస్సులో 41 మంది ప్రయాణిస్తుండగా 20 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది సురక్షితంగా బయట పడ్డారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
Also Read : Minister Nimmala Strong Assurance : మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : నిమ్మల
















