TTD : తిరుమల : కోట్లాది భక్తులను కలిగిన తిరుమల సన్నిధిలో రెండవ సారి ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో)గా బాధ్యతలు చేపట్టడం మామూలు విషయం కాదన్నారు నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్. గతంలో 2017 నుంచి 2020 వరకు తాను ఇక్కడ విధులు నిర్వహించానని చెప్పారు. బుధవారం సామాన్య భక్తుడిగా ఆయన తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ (TTD) ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, అర్చకులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
TTD New EO Comments
టీటీడీ ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ (TTD) పూర్వపు ఈవో శ్యామలరావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబెర్ సెక్రటరీ ఎక్స్ ఆఫీసియో గా కూడా ప్రమాణం చేశారు. వీరితో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు . స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈఓ కు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు . మొదటిసారి మూడు సంవత్సరాలు నాలుగు నెలలు సేవలందించే అవకాశం వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం నుండి లడ్డు, అన్నప్రసాదాల క్వాలిటీ మెరుగు పడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. నిన్న నారా చంద్రబాబు నాయుడుని కలిసి సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు.
శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామనీ, ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగు పరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, ప్రశాంతి, సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : Minister Satya Kumar Fired on YS Jagan : జగన్ దుష్ప్రచారం సత్య కుమార్ ఆగ్రహం



















