OpenAI : ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ త్వరలో భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివర్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారత మార్కెట్లో చాట్జీపీటీ వినియోగం విస్తృతంగా పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ స్వయంగా ప్రకటించారు.
OpenAI – భారత్కు అనుకూల వాతావరణం
శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ –
“భారత్ ఒక గ్లోబల్ ఏఐ లీడర్గా ఎదగడానికి అవసరమైన ప్రతిభ, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇండియా ఏఐ మిషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ప్రశంసనీయమైనది. భారత్లో కార్యాలయం ప్రారంభించడం స్థానిక సేవలను బలోపేతం చేయడంలో తొలి అడుగు అవుతుంది” అని తెలిపారు. అయితే, ఈ విషయంపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
OpenAI – ఇండియా ఏఐ మిషన్లో భాగస్వామ్యం
ఓపెన్ఏఐ ఇప్పటికే ఇండియా ఏఐ మిషన్ భాగస్వామిగా చేరేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయనుంది.
గణాంకాల ప్రకారం, అమెరికా తర్వాత భారత్ చాట్జీపీటీకి రెండవ అతిపెద్ద మార్కెట్గా కొనసాగుతోంది. వీక్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా విద్యార్థులు, డెవలపర్లు ఈ ప్లాట్ఫామ్ను విస్తృతంగా వినియోగిస్తున్నారని ఓపెన్ఏఐ తెలిపింది.
భారత వినియోగదారుల కోసం కొత్త సర్వీసులు
భారతీయ వినియోగదారుల కోసం ఇప్పటికే ‘చాట్జీపీటీ గో’ పేరుతో ప్రత్యేక సబ్స్క్రిప్షన్ సేవలు ప్రకటించింది. రూ.399 ధరతో లభించే ఈ ప్లాన్లో మెసేజ్లు, ఫైల్ అప్లోడ్లు, ఇమేజ్ క్రియేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అదనంగా ఇండిక్ లాంగ్వేజ్ మద్దతుతో పాటు యూపీఐ పేమెంట్స్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు సంస్థ పేర్కొంది.
Also Read : Nitin Gadkari Interesting Update : ఇకపై బస్సులోని విమానాల మాదిరిగా ఎయిర్ హోస్టర్లు



















