Nitin Gadkari : భారతీయ ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. త్వరలోనే దేశంలో విమానాల మాదిరి సౌకర్యాలతో కూడిన అత్యాధునిక బస్సులు ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వెల్లడించారు. బిజినెస్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆధారంగా నడవనున్నాయని, టాటా సంస్థ సహకారంతో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులో టీ, కాఫీ, పండ్లు, శీతల పానీయాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంతేకాక, విమానాలలో ఉండే ఎయిర్ హోస్టెస్ల తరహాలో, వీటిలో బస్ హోస్టెస్లు కూడా సేవలందించనున్నట్లు వివరించారు.
Nitin Gadkari – తక్కువ ఛార్జీ – ఎక్కువ సౌకర్యం
డీజిల్ బస్సులతో పోలిస్తే ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సుమారు 30 శాతం తక్కువ ధరలో ప్రయాణించే అవకాశముందని అంచనా. ఇది ఒకవైపు ప్రజా రవాణాను ఆధునికీకరించగా, మరోవైపు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, మరింత ఆహ్లాదకరంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని గడ్కరీ తెలిపారు.
మౌలిక సదుపాయాల్లో AI వినియోగం
అదనంగా, రహదారి నిర్మాణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని విస్తృతంగా పరిశీలిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సొరంగాలు, వంతెనలు, రహదారుల రూపకల్పనలో AI కీలక పాత్ర పోషించగలదని తెలిపారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు AI ఉపయోగకరంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న AI వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, భారత రహదారి మౌలిక సదుపాయాలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గడ్కరీ అన్నారు.
Also Read : China Strong Reaction : భారత్ పై అమెరికా వేస్తున్న సుంకాలపై ఘాటుగా స్పందించిన చైనా



















