YS Sharmila : విజయవాడ : ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించక పోవడం దారుణమన్నారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). కనీసం కేజీ ఉల్లిగడ్డకు రూ. 3 కూడా రావడం లేదని వాపోయారు. ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఏపీ కూటమి సర్కార్ మాట మార్చిందని ఆరోపించారు. ఉల్లి రైతులను నిండా ముంచిందని ధ్వజమెత్తారు. శుక్రవారం షర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ఉల్లి రైతుల ఉసురు తప్పక తగులుతుందని హెచ్చరించారు. రైతుల ఇంట కన్నీళ్ళు పెట్టించిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.
YS Sharmila Slams AP Govt
ఉల్లి ఎండినా నష్టమే..ఇప్పుడు పండినా నష్టమే. ఎకరాకు రూ.1.20లక్షల పెట్టుబడి పోసి పండిస్తే..మీరిచ్చే ధర కిలోకి 50 పైసలా ? క్వింటాకు 50 రూపాయలా ? ఆరుగాలం కష్టించి ఉల్లి పండిస్తే రైతుకి దక్కిన ఆదాయం ఎకరాకు రూ.3వేలు మాత్రమే కావడం విడ్డూరంగా ఉందన్నారు షర్మిలా రెడ్డి. ఉల్లి వేసిన కారణంగా ఒక్కో రైతుకి వచ్చిన నష్టం ఎకరాకు అక్షరాల రూ.లక్షా 15 వేలు అన్నారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారే. అలాంటి ఉల్లి పండించే రైతే ఉరేసుకొనే పరిస్థితి వస్తే మీరేం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
ఉల్లి రైతులను అప్పుల పాలు చేయడమా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే ? ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్రం సుభిక్షంగా ఎలా ఉంటుంది ? ధర లేక బేజారు అవుతుంటే ఉల్లి రైతు కళ్ళల్లో ఆనందం ఎక్కడుంటుంది ? కర్నూల్ మార్కెట్ లో దళారుల ధరతో సంబంధం లేకుండా క్వింటాకు రూ.1200 ఇస్తాం అన్నారు. రైతులను ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పారు. ప్రచార ఆర్భాటాలు చేసుకున్నారు. ఒక్క రైతుకైనా రూ.1200 గిట్టుబాటు ధర ఇచ్చారా ? ఒక్క కిలో అయినా మార్క్ ఫెడ్ సేకరించిందా ? 50 పైసలకు అమ్ముకోలేక మార్కెట్ లోనే ఉల్లిని వదిలేస్తుంటే, కూలి ఖర్చుల మందం కూడా రాలేదని బోరున విలపిస్తుంటే ఎక్కడుంది రైతు కళ్ళల్లో ఆనందం అని షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Minister Narayana Shocking Update : ఏపీలో 82 లక్షల టన్నుల చెత్త తొలగింపు
















