YS Sharmila : విజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం బీహార్ ఎన్నికలలో లబ్ది పొందేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాషాయ వేషం ధరించారంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కర్నూల్ వేదికగా మోడీ దీపావళి టపాకాయ తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు. వచ్చింది ఏపీకి అని కానీ ఆయన వేసింది బీహార్ ఎన్నికల కోసం కాషాయం ధరించడం దారుణమన్నారు. ఇదంతా ఓట్ల కోసం చేసిన జిమ్మిక్కుగా ఆమె అభివర్ణించారు. బీహార్ ఎన్నికలను ప్రభావితం చేయడానికేనని పేర్కొన్నారు. శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయలకు తెర లేపారంటూ భగ్గుమన్నారు. మరోసారి రాష్ట్ర ప్రజలకు మోడీ చేసింది ఘరానా మోసమేనని సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
YS Sharmila Slams PM Modi
మోడీకి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం మల్లన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి ఇచ్చారా అని ప్రశ్నించారు. రూ.1657 కోట్లతో పెండింగ్ మాస్టర్ ప్లాన్ మీకు కనబడలేదా అని నిలదీశారు. ఉజ్జయిని, వారణాసి, గంగానది కారిడార్ల అభివృద్ధిపై చూపిన ప్రేమ మల్లన్న కారిడార్ పై ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం క్షేత్ర కారిడార్ నిర్మాణ పనులకు కేంద్రం నుంచి అనుమతి ఇవ్వడానికి మనసు ఎందుకు రాలేదన్నారు. ఇది మల్లన్నకు మీరు చేసిన ద్రోహం కాదా అని మండిపడ్డారు. 11 ఏళ్ల క్రితం తిరుపతి వేదికగా చెప్పిన పిట్టకథే మళ్ళీ చెప్పారని ఫైర్ అయ్యారు. అరకొర అప్పులు ఇస్తే ఢిల్లీతో అమరావతి పోటీ పడుతుందా అని అన్నారు. అప్పులకు హామీలు ఇచ్చినంత మాత్రాన ప్రగతిలో పరుగులు పెడుతుందా అని నిప్పులు చెరిగారు షర్మిలా రెడ్డి.
Also Read : Harish Rao Interesting Comments : వైద్య వృత్తి అత్యంత గొప్పది : హరీశ్ రావు


















