మ‌హిళ‌ల గురించి మాట్లాడే హ‌క్కు వైసీపీకి లేదు

రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ

hellotelugu-VasiireddyPadma

అమరావతి : మహిళల గౌరవం విషయంలో వైఎస్ఆర్‌సిపి చాలా కాలం క్రితమే తన నైతిక హక్కును కోల్పోయిందని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా విమర్శించారు. అదే పార్టీ ఇప్పుడు మహిళలను అడ్డం పెట్టుకుని ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు ధర్నాలు చేయడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. బుధ‌వార విడుదల చేసిన వీడియో సందేశంలో ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీలో ఒక సీనియర్ ముఖ్యమంత్రి భార్యను అవమానించినప్పుడు నవ్విన నాయకులు, ఇప్పుడు మహిళల గౌరవం గురించి రోడ్లపైకి రావడం హాస్యాస్పందంగా ఉందన్నారు . ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని చూసి న‌వ్వుకుంటున్నార‌ని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు వాసిరెడ్డి ప‌ద్మ‌.

కన్నతల్లి మీద అసభ్య పోస్టులు వచ్చినప్పుడు స్పందించని వారు, “భార్య” అనే పదం ప్రస్తావించారని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడం వారి రాజరిక మనస్తత్వాన్ని చూపుతుందని విమర్శించారు వాసిరెడ్డి ప‌ద్మ . రాజధాని అమరావతి అంశంలో దేశమంతా మద్దతు పలుకుతున్నప్పటికీ, తమ నేతకు నిజం చెప్పే ధైర్యం లేని నాయకులు ఇప్పుడు ధర్నాలు చేస్తూ సవాళ్లు విసరడం సిగ్గుచేటని ఆమె అన్నారు. రాజధానిపై పార్టీలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అడిగే సత్తా లేని నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేయడం పట్ల ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసిపి నాయకులు రాజరిక, రాతియుగ ధోరణులను విడిచిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు.

Exit mobile version