అమరావతి : రాజధానిపై మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికే రాజధానిపై జగన్ కుట్రలలకు తెర లేపారంటూ ఆరోపించారు. అమరావతికి నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిపై జగన్ అసంబద్ధ ప్రకటనలతో ప్రజల్లో నవ్వుల పాలవుతున్నాడని , అయినా సోయి రావడం లేదన్నారు. రాజ్యాంగంలో ‘క్యాపిటల్’ అనే పదమే లేదని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని పదం లేదనడం రాజ్యాంగంపై జగన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం తప్పా మరోటి కాదన్నారు యనమల రామకృష్ణుడు.
ప్రతిపక్షంలో అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరమన్న జగన్, ముఖ్యమంత్రిగా మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చారని మండిపడ్డారు. రాజధాని అంశంపై జగన్ గందరగోళంలో ఉన్నారని, దీనిపై క్లారిటీ ఇవ్వాలన్నారు . అమరావతి నదీ తీరంలో ఉండకూడదంటూ ఒకే అంశంపై మూడు వేర్వేరు సందర్భాల్లో మూడు వేర్వేరు మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచంలోని అనేక జాతీయ రాజధానులు, ప్రధాన నగరాలు నదీ తీరాలపైనే అభివృద్ధి చెందాయని, ఆ విషయం తెలుసుకోక పోవడం దారుణమన్నారు. నీటి వనరులు, వాణిజ్యం, రవాణా వంటి కీలక అవసరాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే రాజధానులు ఏర్పడ్డాయని చెప్పారు యనమల రామకృష్ణుడు.
