హైదరాబాద్: కొనసాగుతున్న ఆటో ఎల్పిజి కొరతను పరిష్కరించేందుకు ఆటోరిక్షా డ్రైవర్ల జీవనోపాధిని కాపాడేందుకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఒక కీలక చర్యగా ఈరోజు సివిల్ సప్లైస్ భవన్లో ఏజిస్ గ్యాస్, సూపర్ గ్యాస్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్, ప్రైమ్ గ్యాస్, ఎక్స్ట్రా గ్యాస్ , యూని గ్యాస్తో సహా ప్రైవేట్ ఆటో ఎల్పిజి మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్యాస్ సంక్షోభానికి ముందు , సంక్షోభం తర్వాత సరఫరా పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 అవుట్లెట్లతో ఈ ప్రైవేట్ ఆపరేటర్లు 80% ఆటో ఎల్పిజి మార్కెట్ వాటాను నియంత్రిస్తున్నారని గుర్తించారు కమిషనర్. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల నుండి తక్షణమే ఎల్పిజిని సేకరించి దిగుమతి చేసుకోవాలని ఈ సంస్థలకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో సరఫరాను పెంచాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
తగినంత సరఫరా స్థాయిలను నిర్వహించడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎం. స్టీఫెన్ రవీంద్ర గట్టిగా హెచ్చరించారు. ప్రజా రవాణాకు అంతరాయాలను నివారించడానికి ఆటో డ్రైవర్లకు ఇంధన లభ్యతను నిర్ధారించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గల అంశమని ఆయన పునరుద్ఘాటించారు . మధ్య ప్రాచ్య సంక్షోభం కారణంగా తలెత్తిన అంతర్జాతీయ సరఫరా కొరత నేపథ్యంలో ఈ సమీక్ష చేపట్టడం కీలకంగా మారింది. దేశీయ గృహ ఎల్పిజి సరఫరా విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ ఆటో ఎల్పిజి విభాగంలో సరఫరా 35% మేర పడిపోయింది. హైదరాబాద్లో ఆటో కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు పౌర సరఫరాల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు.















