హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తారని వస్తున్న వదంతులలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్లో విద్యుత్ సంస్థల ఇంజనీర్లు ఉద్యోగుల సంఘాల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు . అయినా ఒకింత సంతృప్తి చెందలేదు యూనియన్ నేతలు. ఈ సందర్బంగా విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని ప్రకటించారు మల్లు భట్టి విక్రమార్క.
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల ఫలితంగా ఏర్పడిన విద్యుత్ సంస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాధ్యత ప్రత్యేకించి ఇంజనీర్లు, ఉద్యోగులపై ఉందని, ఆ విషయం అర్థం చేసుకుని సర్కార్ కు సహకరించాలని కోరారు డిప్యూటీ సీఎం. 1912 కు వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కారం చేసి మెరుగైన సేవలకు విద్యుత్ సంస్థలు చిరునామాగా నిలవాలని కోరారు. కాగా జేఏసీ నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు మల్లు భట్టివిక్రమార్క. ఈ క్లిష్ట సమయంలో ఆందోళనలకు దిగడం, నిరసనలు చేపట్టడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
