అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోలీసులకు తీపి కబురు చెప్పారు. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రకటించారు. ఇదే క్రమంలో విధులను, బాధ్యతలను మరిచి పోవద్దని సూచించారు. 2019-24 మధ్య ఉన్న పాలకులు గంజాయి, కల్తీ మద్యాన్ని ప్రధాన సమస్యగా తయారు చేశారని ఆరోపించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని,, గౌరవం పెరిగేలా చర్యలు చేపడతాం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14,770 సీసీ కెమెరాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న కెమెరాలను కలిపి 1 లక్ష కెమెరాలను అనుసంధానించాం అన్నారు. నేరాల దర్యాప్తులో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, డీఎన్ఏ డిటెక్షన్ లాంటి ఆధునిక విధానాలు పెరిగాయని చెప్పారు. వేగంగా నేరాలను గుర్తించ గలుగుతున్నాం అన్నారు. టెక్నాలజీ, నాలెడ్జి, బెస్ట్ ప్రాక్టీసెస్ను పోలీసు అధికారులు సమర్థంగా అమలు చేస్తే శాంతిభద్రతలు నియంత్రణలోకి వస్తాయన్నారు సీఎం. రాజకీయ నేరాలు, డిజిటల్ నేరాలు, సోషల్ మీడియా అసభ్య పోస్టుల లాంటి నేరాలు పెరిగాయని పేర్కొన్నారు.
మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ అని పదేపదే చెబుతున్నాను. ఈ విషయంలో కఠినంగా ఉండాల్సిందే. నేరం జరిగిన ప్రాంతాన్ని సంరక్షించటంలో విఫలం కాకూడదన్నారు నారా చంద్రబాబు నాయుడు. నేర నియంత్రణకు పోలీసులూ గోల్డెన్ అవర్ విధానాన్ని పాటించాలన్నారు. తప్పు చేస్తే నేరస్తులు తప్పించు కోలేరని తెలిసేలా చేయాలన్నారు. వివేకా హత్య కేసు ఘటనలో పూర్తి సమాచారం రాలేదు. పోలీసుల వైపు నుంచి జరిగిన కాస్ట్ లీ మిస్టేక్ అది. కొందరు కావాలనే తప్పు దోవ పట్టించారు. ఇల్లంతా రక్తం మరకలతో తడిస్తే ఆ ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు. ఇది పూర్తి నిర్లక్ష్యం. నేరస్తుల పట్ల ఉదాసీనంగా ఉండొద్దు. జీరో డ్రగ్స్, గంజాయి లేకుండా జాతీయ స్థాయిలో ఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మహిళల భద్రతతో పాటు గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం డ్రగ్స్ వద్దు బ్రో అన్న ప్రచారాన్ని విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారు. రహదారి భద్రత కూడా కీలకమైన అంశం. రోడ్డు ప్రమాదాల అరికట్టేలా సైనేజీలు, రోడ్ ఇంజనీరింగ్, హాట్స్పాట్లను ఆడిట్ చేయాలి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
















