తిరుమల : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను గ్రామ స్థాయిలో విస్తరించేందుకు టీటీడీ కృషి చేస్తున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవను మరింత విస్తరించేందుకు గ్రూప్ సూపర్వైజర్లు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 వేల ఆలయాలు ఉన్నాయని, ఆయా దేవాలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించేందుకు ఉన్న అవకాశాలను శ్రీవారి సేవకుల ద్వారా టీటీడీ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు.
గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమం ద్వారా నేర్చుకున్న అంశాలను తమ ప్రాంతాల నుండి శ్రీవారి సేవకు విచ్చేసే ముందు సేవకులకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు తిరుమలకు వచ్చి నాణ్యమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. శ్రీవారి సేవకులు స్వామి వారికి సేవ చేయడానికి తిరుమలకు రావడంతో పాటు తమ ప్రాంతాలు, గ్రామాల్లోని స్థానిక ఆలయాల్లో సేవలందించేలా వారిని ప్రోత్సాహించాలని చెప్పారు. శ్రీవారి సేవకులకు వారి పనితీరు ఆధారంగా సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ ఇచ్చి, ఆ రేటింగ్ ఆధారంగా విధులు కేటాయించే విధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమం, శ్రీవారి సేవను గ్రామస్థాయిలో విస్తరించడం, భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం వంటి అంశాలపై గ్రూప్ సూపర్వైజర్ల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
అనంతరం ఆయన గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.టి. శ్రీనివాస్, చైన్నైకు చెందిన శరత్ లను శాలువాతో సత్కరించారు.
