అమరావతి : వికసిత్ భారత్ , స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తమ ముందు ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం మిగిలి ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. మనం స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని పెట్టుకున్నాం అన్నారు. ఈ రెండు లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలన్నారు. అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం అన్నారు సీఎం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగమని పేర్కొన్నారు. అంతా కలిసి ఐక్యంగా, బాధ్యతగా స్వర్ణాంధ్రను నిర్మిద్దాం, వికసిత్ భారత్ను సాకారం చేద్దాం అని పిలుపునిచ్చారు. ఇందు కోసం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దృఢమైన సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.
గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంటూ వచ్చామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. రాష్ట్రం కూడా ఎన్నో ఒడిదుడుకులు చూసిందని పేర్కొన్నారు .ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మనకు గుర్తింపు తెచ్చిందన్నారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ అవతరించిందని గుర్తు చేశారు సీఎం. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగింది. ప్రతిసారీ సవాళ్లు, సంక్షోభాలు మారుతూ వచ్చాయి. కానీ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదలే గెలిచిందన్నారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నించాం అన్నారు.
2019లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. 2019లో వచ్చిన పాలకులు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆ ఐదేళ్లూ చీకటి రోజులు చూశాం అని ఆవేదన చెందారు సీఎం. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడింది అని అన్నారు. ఆర్థికంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు వచ్చాయన్నారు. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి’ అని కోరాం. కూటమిపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించారన్నారు. 94 శాతం స్ట్రయిక్ రేట్తో 57 శాతం ఓట్ షేర్తో చరిత్రలో నిలిచి పోయే తీర్పు ఇచ్చారన్నారు.
















