ముంబై : భారత జట్టు మాజీ క్రికెటర్ , సెలెక్టర్ పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విరాట్ కోహ్లీ ఫామ్ పై స్పందించాడు. ఇవాళ జియో హాట్ స్టార్ తో మాట్లాడారు. విరాట్ కోహ్లీ ఫామ్ ఖచ్చితంగా ఈ జట్టుకు సహాయ పడుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. అతను పూర్తి స్థాయి ఐపీఎల్ ఆడాడు, కాబట్టి ఈ సిరీస్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటూ వచ్చాడని పేర్కొన్నాడు. ఇక బుమ్రా విషయంలో అయితే, అతని పనిభారాన్ని జాగ్రత్తగా నిర్వహించడం ముఖ్యం అన్నాడు పటేల్ . దక్షిణాఫ్రికాలో జరగనున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2027 కోసం సన్నాహాలు ఊపందుకుంటున్న తరుణంలో, ఇంగ్లాండ్తో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత జట్టుకు విదేశీ పరిస్థితులకు అలవాటు పడే విషయంలో కీలకమైనదిగా నిలవనుంది.
జియోస్టార్ నిపుణులు అభిషేక్ నాయర్ , పార్థివ్ పటేల్ వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల ఉనికి ప్రాముఖ్యతను, అలాగే జస్ప్రీత్ బుమ్రా , కుల్దీప్ యాదవ్ జట్టులోకి తిరిగి రావడం గురించి చర్చించారు. ఇంగ్లాండ్ సిరీస్కు వెళ్తున్న విరాట్ కోహ్లీ ప్రేరణ గురించి పార్థివ్ పటేల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. విరాట్ కోహ్లీ ఇంకా సాధించాల్సింది ఏముంది? అతను 2011లో ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు, అలాగే మిగిలి ఉన్న ఏకైక టైటిల్ అయిన T20 ప్రపంచ కప్ను కూడా గెలుచుకున్నాడు. అతని నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ టెస్ట్ జట్టుగా నిలిచింది, అలాగే ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం సాధించడంలోనూ జట్టును నడిపించాడు. కాబట్టి, అతను ఎంత ప్రేరణతో ఉన్నాడన్నదే నా ముందున్న ప్రశ్న అని అన్నాడు పటేల్.
