హైదరాబాద్ : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏమీ అనక పోయినా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఎథిక్స్ కమిటీకి పంపడం దారుణమన్నారు. కేవలం రాజకీయ వేధింపులు తప్ప మరోటి కాదన్నారు. ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి కామెంట్స్ చేయక పోయినా ఎలా ఎథిక్స్ కమిటీకి పంపిస్తారంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. నిజంగా ఎథిక్స్ కమిటీ ఉంటే ముందుగా సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అలా చేయాలని అనుకుంటే ముందుగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీకి పంపించాల్సి ఉంటుందన్నారు .
సభా నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తాను సీఎం హోదాలో ఉన్నాన్న సోయి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నడని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా కామెంట్స్ చేశాడని , తను ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి. తల మీద కాలు పెట్టి తొక్కి వస్తానంటూ అసెంబ్లీలో మాట్లాడింది నువ్వు కాదా అని సీఎంను నిలదీశారు. సాక్షాత్తు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారని, అయినా బాధ్యత కలిగిన స్పీకర్ స్పందించక పోవడం, చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై ముందు ఎథిక్స్ కమిటీకి చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేయాలని కోరారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డినే టార్గెట్ చేయడం సరైంది కాదన్నారు. సభ గౌరవాన్ని దెబ్బతీసిన వారందరిపై సమానంగా విచారణ జరగాలన్నారు. ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం ఉండ కూడదన్నారు. ఇది చట్టం ఒప్పుకోదన్నారు ప్రశాంత్ రెడ్డి.
