అమరావతి : ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఉన్న బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించి, దేశ అవసరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకోవాలని అన్నారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేతృత్వంలోని బృందం సీఎం తో రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. శ్రీకాకుళం జిల్లాలో రూ.16 వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ ఏర్పాటు చేసే టైటానియం ప్లాంట్ ఏర్పాటు, బీచ్ శాండ్ మైనింగ్, వాటికున్న డిమాండ్ వంటి అంశాలను అదానీ ప్రతినిధుల బృందం వివరించింది.
బీచ్ శాండ్ లో లభ్యమయ్యే ఇల్మెనైట్ మినరల్ కు కు విలువ జోడించి టైటానియం స్లాగ్, TiO₂, టైటానియం స్పాంజ్ వంటివి ఉత్పత్తి చేయవచ్చని అదానీ గ్రూప్ ప్రతినిధులు చెప్పారు. పెయింట్స్, కోటింగ్స్, కాస్మెటిక్స్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, యూవీ రక్షణ ఉత్పత్తులు వంటి వాటిల్లో TiO₂ను వినియోగించు కోవచ్చని పేర్కొనన్నారు. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్, అదానీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కూల్, అదానీ ఆరోగ్య మందిర్ పేరుతో 1,000 పడకల ఆసుపత్రి, 150 సీట్ల మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు కూడా వారు తెలిపారు. అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్ నిర్మాణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ వివరాలను అదానీ గ్రూప్ ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, గనుల శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
