తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన మొదటి మూడు రోజులకు ఆన్లైన్ ఈ డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంద. గత నెల 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ నిన్నటితో ఐదు గంటలకు ముగిసింది. టీటీడీ పిలుపు మేరకు 9,55,703 రిజిస్ట్రేషన్ ల ద్వారా 24,05,237 వివరాలను భక్తులు సమర్పించారు. ఈ డిప్ లో ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా పూర్తి సమాచారాన్ని పంపుతారు. ఆ సమాచారం లో లింక్ ఓపెన్ చేసుకొని ఉచిత టోకెన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్.
డిసెంబర్ 30వ తేదీకి 57, 31వ తేదీకి 64 జనవరి ఒకటవ తేదీకి 55వేల టోకెన్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. కాగా మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులను నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు ఈవో. అదే సమయంలో రోజుకు 15000 చొప్పున 300 రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు, 1000 శ్రీవాణి దర్శన టోకెన్లు కోటా అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు అనిల్ కుమార్ సింఘాల్. వీటికి సంబంధించి ఈనెల 5వ తేదీన వాటిని ఆన్లైన్లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు . ఇదిలా ఉండగా లక్షలాది మంది భక్తులు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వేచి చూస్తున్నారు.


















