Vaikunta Dwara Darshan : తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ (TTD) విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు వివరాలు ఇలా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు (Vaikunta Dwara Darshan) అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు.
కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు. మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందించ బడతాయని టీటీడీ తెలిపింది.
TTD Vaikunta Dwara Darshan Updates
వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెంః 9552300009 కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం ఇంగ్లీష్, తెలుగు భాషలను సెలక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాలి.అనంతరం మీరు ఎంచుకున్న భాషలో సర్వీసెస్ విండో కనిపిస్తుంది. ఆ సర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయగానే వైకుంఠ ద్వార దర్శనం (డిప్) రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలను ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయాలి.
అనంతరం డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో మీకు దర్శనం కావాల్సిన రోజులను లేదా మూడు రోజులను ప్రయారిటీగా ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత వివరాలను సరి చూసుకుని SUBMIT చేయాల్సి ఉంటుంది. ఒకసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి వీలు పడదు. ఆధార్ నంబర్, పిన్ కోడ్ ను తప్పుగా నమోదు చేస్తే మార్చు కోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల వివరాలు విజయవంతంగా SUBMIT చేయగానే ACKNOWLODGEMENT మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రిఫరెన్సు నెంబర్ గా పరిగణించడం జరుగుతుంది. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది.
వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో SED, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు, తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయబడవు. వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపి వేయడం జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబోమంటూ పేర్కొంది టీటీడీ.
Also Read : Gautam Gambhir Sensational : భారత్ పరాజయం గంభీర్ పై గరంగరం


















