TTD : తిరుపతి : ఈనెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామి వారికి ఈ పవిత్రోత్సవ సేవ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టిటిడి (TTD
) ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబరు 16వ తేదీన ఉదయం 9 గంటలకు ఆచార్య ఋత్వికరణం, సాయంత్రం 6 గంటలకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.
TTD Pavitrotsavams Update
పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబరు 17వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబరు 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరి రోజు అక్టోబరు 19వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి తదితర వైదిక కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
భక్తులు రూ. 516 చెల్లించి ( ఇద్దరు భక్తులు ఒక రోజుకు) సంపూర్ణ అర్చనా ఫలమును అందించు ఈ పవిత్రోత్సవ సేవ వైదిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొన్న వారికి ఒక పవిత్రమాలతో పాటు ఒక ఉత్తరీయం, రవిక, అన్నప్రసాదం బహుకరిస్తారు. ఇదిలా ఉండగా శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు సందర్భంగా అక్టోబర్ 16న తిరుప్పావడ సేవను, అక్టోబర్ 17 నుండి 19 వరకు నిత్య కళ్యాణోత్సవం సేవలను రద్దు చేశారు.
Also Read : DGP Harish Kumar Strong Security : శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ



















