తిరుమల : శ్రీవారి భక్తులకు బిగ్ షాక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఈ మేరకు కొత్త ఏడాది సందర్బంగా భారీ ఎత్తున భక్తులు కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు లక్షలాదిగా తరలి రానున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వైకుంఠ ద్వారా దర్శనం సందర్బంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు 2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేయడం జరిగిందని తెలిపారు.
డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ,30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. పైన పేర్కొన్న రోజులకు ముందు రోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు.


















