TTD : తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20వ తేదీన దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందని పేర్కొంది.
TTD Diwali Speaicl Updates
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని కూడా స్వామి వారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామి వారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.
కాగా సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇదిలా ఉండగా దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
Also Read : CM Revanth Reddy Important Update : బీసీ రిజర్వేషన్లపై సీఎం కీలక సమీక్ష
