తిరుమల : వైకుంఠ ద్వారా దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసే పనిలో పడింది టీటీడీ. ఇప్పటికే కేవలం టోకెన్లు ఉన్న వారికే ప్రయారిటీ ఉంటుందని ప్రకటించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ సందర్బంగా తిరుమలకు భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. గురువారం తిరుమలలోని శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ నాణ్యత, బరువు, జారీ విధానం, సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించడంతో పాటు భక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించారు.
దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపుతో లడ్డూలు పొందే విధానాన్ని, కియోస్క్ యంత్రాల పనితీరును పరిశీలించారు బీఆర్ నాయుడు. బూందీ పోటులో లడ్డూ తయారీ ప్రక్రియను కూడా తనిఖీ చేసి అధికారులకు సూచనలు ఇచ్చారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల దృష్ట్యా లడ్డూల కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్బంగా వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు అందిస్తున్నామని చెప్పారు.
లడ్డూల నాణ్యత, రుచి, క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గడంపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తిని మరింత పెంచి భక్తులకు త్వరితగతిన లడ్డూలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.



















