ఢిల్లీ : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశాడు. తనకు ఉన్న విజన్ ఏ నాయకుడికి రాష్ట్రంలో లేదన్నాడు. తన దూరదృష్టి కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిందన్నాడు. తన విజన్ సూపర్ అంటూ కితాబు ఇచ్చాడు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. ఆదివారం న్యూఢిల్లీలో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో , ఏ రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో ప్రపంచ దిగ్గజ ఆటగాడు మెస్సీని హైదరాబాద్ కు తీసుకు రావడంలో సక్సెస్ అయ్యాడని , అది కేవలం తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే సాధ్యమైందన్నాడు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ , బీజేపీపై విమర్శలు గుప్పించారు. మరో వైపు తెలంగాణ జాగృతి అధినేత్రి కె. కవిత ఏదో ఒక రోజు సీఎం అవుతానంటూ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. కాగా ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ తర్వాత తెలంగాణ అన్ని రాష్ట్రాలను అధిగమించ బోతోందని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఈ ఆశించిన విజయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టమైన విజనే కారణమని గౌడ్ ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి బలంగా ఉందని, దాని సాటిలేని సంక్షేమ కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఉన్న అద్భుతమైన హోదా మరింత పటిష్టం అవుతోందని అన్నారు.

















