Tirupati : తిరుపతి – తిరుపతి లోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి (Sri Prasanna Venkateswara) ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో జూన్ 07 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్య కైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Tirupati Sri Prasanna Venkateswra Pooja
ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్ప యాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూల మూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారిని కొలువు తీర్చారు.
మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఒక టన్ను పుష్పాలను ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి టిటిడి సరఫరా చేసింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Also Read : TTD Interesting Update : వేద పండితులకు గౌరవ వేతనం – టీటీడీ



















