Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించేందుకు జూన్ నెలలో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో టీటీడీ హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. కలియుగ దైవంగా విఖ్యాతమైన శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఏడాది జూన్ నెలలో రూ.119.86 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala) అధికారులు వెల్లడించారు.
Tirumala Revenue Growth
ఈ నెలలో మొత్తం 24.08 లక్షల భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక జూన్ 30న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ. 5.30 కోట్లుగా నమోదైంది. జూన్ 14న అత్యధికంగా 91,720 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక మొత్తం ఐదు రోజుల పాటు ప్రతి రోజు 90 వేల మందికి పైగా, మరో పది రోజుల్లో 80 వేల మందికిపైగా భక్తులు దర్శనానికొచ్చారు.
రోజుకు సగటున రూ.4 కోట్లకు పైగా హుండీ ఆదాయం సమకూరగా, మొక్కుల రూపంలో తలనీలాలు సమర్పించిన 10.05 లక్షల మంది భక్తులు ఉన్నారు. గత మే నెలతో పోలిస్తే జూన్లో భక్తుల సంఖ్య, ఆదాయం రెండూ గణనీయంగా పెరిగాయి. మే నెలలో 23.77 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించగా, హుండీ ఆదాయం రూ.106.83 కోట్లుగా నమోదైంది.
జూన్ నెలలో పెరిగిన భక్తుల సంఖ్య దృష్ట్యా, టీటీడీ విస్తృత స్థాయిలో సేవలు అందించింది. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి, యాత్ర అనుభవాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చేందుకు కృషి చేసింది. శ్రీవారి ఆదాయం ఇలా సతతంగా పెరుగుతుండటం కలియుగ దైవంగా వెంకన్న ఆదరణకు నిదర్శనమని భక్తులు భావిస్తున్నారు.
Also Read : Popular Medaram Jathara 2026 : తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర తేదీలు ఇవే



















