అమెరికా : ఫుట్ బాల్ క్రీడా ప్రేమికులకు తీపి కబురు చెప్పింది ఫిఫా. వరల్డ్ కప్ కోసం టికెట్లను ప్రకటించింది. ఈ టికెట్లు అర్హత కలిగిన జట్ల అభిమానుల కోసం రిజర్వ్ చేసినట్లు తెలిపింది. ఒక్కో టికెట్ ధర 51 యూరోలు లేదా 60 డాలర్లుగా ఖరారు చేసింది. ప్రతి జాతీయ సమాఖ్య కేటాయింపులో 10 శాతం ఉంటుందని తెలిపింది ప్రపంచ ఫుట్బాల్ పాలక సంస్థ అయిన ఫిఫా తాజాగా రిలీజ్ చేసిన ప్రకటనలో. ఇందులో భాగంగా సపోర్టర్ ఎంట్రీ టైర్ టిక్కెట్లు ఒక్కొక్కటి 60 డాలర్లకు సెట్ చేసినట్లు తెలిపింది. ఫైనల్తో సహా అన్ని 104 మ్యాచ్లకు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది ఫిఫా. యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోలో జరిగే 2026 పోటీలో ధరలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
చివరకు నిర్వాహకులు ఓ మెట్టు దిగారు. ఫుట్ బాల్ అభిమానుల కోసం చౌకైన టికెట్ల కేటగిరీని ప్రకటించారు. టోర్నమెంట్ అంతటా తమ జాతీయ జట్లను అనుసరించి ప్రయాణించే అభిమానులకు మరింత మద్దతు ఇవ్వడానికి ఖరారు చేసినట్లు ఫిఫా వెల్లడించింది. ఇదిలా ఉండగా 2022లో ఖతార్లో కంటే టిక్కెట్ ధరలు దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఎఫ్ఎస్ఈ ఆరోపించింది. తొలి నుంచి చివరి దాకా మ్యాచ్ చూడాలంటే ఒక్కొక్కరికి 6,900 డాలర్లకు పైగా ఖర్చు అవుతుందని వాపోయాడు. 2021లో విడుదల చేసిన బిడ్ డాక్యుమెంట్ లలో 21 డాలర్లకు ఓ టికెట్ ఉండాలని నిర్ణయించారని తెలిపాడు. కానీ వాటిని తుంగలో తొక్కారంటూ ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిఫా కీలక ప్రకటన చేసింది.



















