తమిళనాడు : రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. నువ్వా నేనా అన్నంతగా మాటల తూటాలు పేలుతున్నాయి. మరో వైపు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ చాపకింద నీరులా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. తండ్రీ కొడుకులు సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ లు అన్నీ తామై ప్రచారం చేపట్టారు. మరో వైపు ఏఐడీఎంకే, భారతీయ జనతా పార్టీలతో కూడిన ఎన్డీయే కూటమి నానా తంటాలు పడుతోంది . ఒక రకంగా చెప్పాలంటే నిన్నటి దాకా త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ రోజు రోజుకు డీఎంకే వర్సెస్ టీవీకే పార్టీల మధ్య వార్ కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది.
ఇక ఒకే ఒక్కడు , స్టార్ హీరో గా గుర్తింపు పొందిన, లక్షలాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అన్నీ తానై క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఆయన ప్రధానంగా స్టాలిన్ ను టార్గెట్ చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను నిర్వహించిన రోడ్ షోకు వేలాది మంది జనం తరలి వచ్చారు. ఎక్కడ చూసినా జనసంద్రం కనిపించింది. ఈ తరుణంలో తాజాగా
తిరునెల్వేలిలో జరిగిన సభలో విజయ్ మాట్లాడుతూ డీఎంకే పార్టీ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కొన్ని కోట్ల రూపాయలకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీని కొనుగోలు చేసిందని మండిపడ్డారు. అయితే నిజమైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులంతా టీవీకే వెంట ఉన్నారని ప్రకటించారు. విజయ్ చేసిన కామెంట్స్ అటు డీఎంకేలో ఇటు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి.
