అమరావతి : తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం. ఈ సందర్భంగా తన కేసులో నిష్పాక్షికతను కోరారు మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వర్ రావు. ఉదయ్ కృష్ణ రెడ్డికి సంబంధించిన క్రమశిక్షణా చర్యలలో నిష్పాక్షికత, సమానత్వం ఉండాలని కోరారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ప్రొబేషనర్ ఉదయ్ కృష్ణ రెడ్డి,ఒక మహిళా సహ-శిక్షణార్థికి సంబంధించిన వ్యవహారంలో ఈ చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూ, ఈ కేసులో రెండు భిన్నమైన వాదనలు ఉన్నప్పుడు క్రమశిక్షణా చర్యలు ఏకపక్షంగా ఉండకూడదని రావు పేర్కొన్నారు. మహిళా ప్రొబేషనర్ లైంగిక వేధింపులు, దాడి ఆరోపణలు చేయగా, రెడ్డి ఆ ఆరోపణలను ఖండించారు. తమ మధ్య సంబంధం పరస్పర అంగీకారంతోనే జరిగిందని, తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆయన వాదించారు.
ఉదయ్ కృష్ణ రెడ్డి కానిస్టేబుల్ స్థాయి నుండి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ప్రస్థానాన్ని కూడా ప్రస్తావించారు మాజీ సీబీఐ డైరెక్టర్. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నంత కాలం అతని శిక్షణ కూడా కొనసాగాలని ఆయన అన్నారు. ఆరోపించబడిన దుష్ప్రవర్తనకు సంబంధించి ఇద్దరు ప్రొబేషనర్లపై ఒకే విధమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, లేదా విచారణ పూర్తయ్యే వరకు రెడ్డి సస్పెన్షన్ను రద్దు చేయాలని ఆయన సూచించారు. మహిళా ట్రైనీ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు లైంగిక వేధింపులు, అసభ్యకర వీడియోల పోస్టింగ్, వెంబడించడం (స్టాకింగ్) , బ్లాక్మెయిలింగ్ వంటి ఆరోపణలతో కేసు నమోదు చేశారు. అలాగే విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఉదయ్ కృష్ణకు నోటీసు జారీ చేశారు. బోరబండలోని మోతీనగర్లో ఉన్న తన సోదరుడి నివాసంలో ఆత్మహత్యాయత్నం చేశారు ఉదయ్ కృష్ణా రెడ్డి.
















