హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలో దశల వారీగా చెరువులను అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు . తమ చెరువులను అభివృద్ది చేయాలని నగర వాసులు కమిషనర్ ను కోరారు. తమ చెరువులో మురుగు నీరు వచ్చి చేరుతోందని, దుర్గంధభరిత వాతావరణంతో నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గుర్రపు డెక్కపెరిగి దోమలతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాం అని పేర్కొన్నారు. పగలూ, రాత్రి అనే తేడా లేకుండా కిటికీలు, తలుపులు బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ చెరువుల్లో మురుగు నీరు కలవకుండా చూడాలని కోరారు కమిషనర్ ను. ఇదే క్రమంలో మా చెరువులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.
హైడ్రా ఆధ్వర్యంలో ఫోన్ – ఇన్ కార్యక్రమం చేపట్టారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తో నగర ప్రజలు విన్నవించుకున్నారు. ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణికి అదనంగా శనివారం రోజు ఫోన్ – ఇన్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషమని అభినందించారు. హైడ్రా కార్యాలయం వరకూ రాలేని వారు.. సమస్యలను ఫోనులో చెప్పుకునే అవకాశం ఇవ్వడం సంతోషమన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ జరిగిన ఫోన్-ఇన్ కార్యక్రమంలో నేరుగా కమిషనర్ ఫిర్యాదుదారులతో మాట్లాడారు. వారి సమస్యలను విని.. పరిష్కారానికి సంబంధిత అధికారి వివరాలను అందజేశారు. వారం తర్వాత పరిష్కారం కాకుంటే నేరుగా తనకు ఫోను చేయాలని ఫిర్యాదుదారులను కోరారు.
