అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించినందుకు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏఈవో చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం, కలెక్టర్, ఎస్పీలను ఈ సందర్బంగా ప్రత్యేకంగా అబినందనలతో ముంచెత్తారు సీఎం. డిసెంబర్ 30 తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు కల్పించిన ఉత్తర ద్వార దర్శనంలో 97 శాతం మంది సామాన్య భక్తులే దర్శనం చేసుకోవడం అభినందనీయం అన్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్తర ద్వార దర్శనంలో 7.83 లక్షల మందికి దర్శనం కల్పించడం ద్వారా శ్రీవారి అనుగ్రహానికి వారిని పాత్రులను చేయడం మామూలు విషయం కాదన్నారు. క్యూలైన్ల మానిటరింగ్, అన్నప్రసాదం అందించడం నుంచి భక్తులకు కల్పించే ప్రతి సౌకర్యంలో తీసుకున్న జాగ్రత్తలు, అమలు చేసిన విధానాలు మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
శ్రీవారి భక్తులు సంతృప్తి చెందేలా వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడుకునేందుకు భక్తులు కూడా కలిసి రావాలని కోరుతున్నానని అన్నారు. ఇదే సమయంలో సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుక జగ్గన్న తోట ప్రభల తీర్థం ను ఈసారి రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ప్రతి ఏటా కనుమ రోజు జగ్గన్న తోటలో జరిగే ఈ అతిపెద్ద పండుగలో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనం ఇస్తాయన్నారు.


















