కేరళ : కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై సీరియస్ అయ్యారు కేరళ సీఎం పినరయ్ విజయన్ . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం కార్పొరేట్ శక్తుల కోసం, బడా వ్యాపారవేత్తల ప్రయోజనాలు కాపాడేందు కోసమే సర్కార్ పని చేస్తోందని ధ్వజమెత్తారు. ఇది ఎంత మాత్రం దేశానికి మంచిది కాదన్నారు. కావాలని కార్మిక చట్టాలను వారికి అనుకూలంగా ఉండేలా మార్పులు తీసుకు వచ్చిందని ఆరోపించారు పినరయ్ విజయన్. ఇందుకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులు సంఘటితం కావాలని, పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక విధానాల ద్వారా ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేందుకు కుట్రకు తెర లేపిందన్నారు.
విచిత్రం ఏమటంటే ప్రధానంగా ప్రతిపక్షాలతో తగినంత చర్చ లేకుండానే పార్లమెంటులో కార్మిక కోడ్లను ఆమోదించారని ఆవేదన వ్యక్తం చేశారు మఖ్యమంత్రి. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఇది సూచిస్తుందని పినరయ్ విజయన్ అన్నారు. ఇది కార్మిక రంగాన్ని కార్పొరేట్ నియంత్రణలోకి తీసుకు రావడానికి ఒక ప్రణాళికాబద్ధమైన చర్య తప్ప మరోటి కాదన్నారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన కార్మిక కోడ్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్వహించిన లేబర్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. సాంకేతికత, ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులతో మన చుట్టూ ఉన్న ప్రపంచం వేగంగా మారుతోందని అన్నారు. అయితే ఈ మార్పులు ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనే ప్రశ్నను లేవనెత్తారు.















