Tesla : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. జూలై 15న ముంబయిలో మొదటి షోరూమ్ను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో ఈ షోరూమ్ ఏర్పాటు కానుంది. దీనికై ఇప్పటికే ఐదు టెస్లా Y మోడల్ కార్లు చైనా షాంఘై నుంచి ముంబయికి తరలించబడ్డాయి.
Tesla – దేశవ్యాప్తంగా విస్తరణకు రంగం సిద్ధం
ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరో షోరూమ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. టెస్లా ఎంట్రీ కోసం 2021 నుంచి అనేక చర్చలు జరిగాయి. కంపెనీ తరఫున దిగుమతి సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేయగా, కేంద్ర ప్రభుత్వం దేశీయ ఉత్పత్తి ప్రోత్సహించేలా కొన్ని షరతులు విధించింది. ముఖ్యంగా దేశంలో తయారీ చేయడం, స్థానికంగా విడిభాగాల కొనుగోలు చేయడం వంటి అంశాలపై ఒప్పందానికి వచ్చిన అనంతరం, టెస్లా (Tesla) ఎంట్రీకి మార్గం సుగమమైంది.
లాంచ్కు లైన్ క్లియర్ – అధికారికంగా షురూ
సమీప భవిష్యత్తులో భారత మార్కెట్లోకి తమ అడుగుపై స్పష్టత ఇస్తూ, టెస్లా ఇటీవల “2025 జులై.. కమింగ్సూన్ ఇండియా” అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. కంపెనీ ప్రకారం, జూలై 15న ఉదయం 10:30 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభ వేడుకకు సంబంధించి ఆహ్వానాలు పంపించిందని సమాచారం.
మస్క్ ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్
టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో టెస్లా ప్రణాళికలపై చర్చించగా, ఎంట్రీకి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మధ్యలో టెస్లా అధికారికంగా భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది.
ప్రపంచంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ వాహన సంస్థ అయిన టెస్లా, భారత మార్కెట్ను లక్ష్యంగా పెట్టుకొని తీసుకుంటున్న ఈ అడుగు, దేశీయ EV రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చెందేలా చేయనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read : Today Gold Price : పసిడి ప్రియులకు మరో షాక్



















