హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఇవన్నీ అన్ని వర్గాలలో ఉన్న పేదలకు మేలు చేకూరేలా చస్తోందన్నారు సీఎం. తెలంగాణ రైజింగ్ పేరుతో ముందుకు వెళుతున్నామన్నారు. విద్యా రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణ కొత్త శిఖరాలను అధిగమిస్తోందని పేర్కొన్నారు సీఎం.
మనం భారతదేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా ఉన్నామని ఈ విషయం కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఈ సంవత్సరం (2025-26) మన తలసరి ఆదాయం రూ. 4,18,931గా ఉందని వెల్లడించారు. ఇది గత సంవత్సరం రూ. 3,80,031 నుండి పెరిగిందని స్పష్టం చేశారు సీఎం. ఒకే సంవత్సరంలో మనం 10.23 శాతం వృద్ధిని సాధించామని , ఇది రూ. 38,900 పెరుగుదలను సూచిస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
కఠోర శ్రమ, ఆర్థిక వృద్ధిపై దృష్టి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అన్ని రంగాలలో సమతుల్య అభివృద్ధి, తాత్కాలిక విధానాల నుండి విధాన ఆధారిత పాలనకు మారడం, ఇంకా ఎంతో శ్రద్ధతో కూడిన పని, నిరంతర సమీక్షలు, వివరాలపై శ్రద్ధ, భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ద్వారా ఇది సాధ్యమైందని అన్నారు సీఎం. దశాబ్ద కాలంగా ఉన్న వైఫల్య పాలనను, నిరాశా నిస్పృహలను మనం తిప్పికొట్టి, ప్రతి పౌరుడిలో పాలనలోని ప్రతి అంశంలో ఆశాభావాన్ని, నమ్మకాన్ని నింపామన్నారు సీఎం. మన విజయం వల్ల మహిళలు, రైతులు, యువత అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
















