హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆకర్షించే పనిలో పడింది. ఈ మేరకు సర్కార్ సూచనల మేరకు హైదరాబాద్ నుండి తెలంగాణ పర్యాటక శాఖ ఒక రోజు తీర్థయాత్ర ,పర్యావరణ పర్యటన ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో మూడు ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రసిద్ధ శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయం, ఎక్స్పీరియం ఎకో పార్క్ తో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన కొత్తవాల్గూడ ఎకో టూరిజం పార్క్ ఉంది. హైదరాబాద్ సమీపంలో ఆధ్యాత్మికత, ప్రకృతి, కుటుంబ వినోదాల కలయికను పర్యాటకులకు అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఇది ఆగస్టు 7వ తేదీన శుక్రవారం నాడు ప్రారంభం కానుంది. దీనిలో చిలుకూరు బాలాజీ ఆలయం, ఎక్స్పీరియం ఎకో పార్క్ మరియు కొత్తవాల్గూడ ఎకో టూరిజం పార్క్ వంటి కీలక ప్రదేశాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల ప్రకారం ఈ పర్యటన వారాంతపు విహార యాత్రకు అనుకూలంగా రూపొందించ బడింది. ప్రయాణికుల కోసం ఏసీ మినీ వాహనం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 7 గంటలకు మూడు వేర్వేరు పాయింట్ల నుండి ప్రయాణం మొదలవుతుంది; తారామతి బరాదారీలో అల్పాహారం తీసుకున్న తర్వాత, ఉదయం 9 గంటలకు చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకుంటారు. తదుపరి గమ్యస్థానం ఎక్స్పీరియం ఎకో పార్క్; మధ్యాహ్న భోజనం తర్వాత కొత్తవాల్గూడ ఎకో టూరిజం పార్క్కు వెళ్తారు. సాయంత్రం టీ విరామం తర్వాత, పర్యాటకులను రాత్రి 7 గంటలకు బషీర్బాగ్ వద్ద దింపుతారు. పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 2,100, పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 1,800 చొప్పున రుసుము నిర్ణయించారు. ఈ ధరలో రాకపోకల రవాణా, అల్పాహారం, శాకాహార భోజనం, సాయంత్రం టీ , రెండు ఎకో పార్కుల ప్రవేశ టిక్కెట్లు, టోల్ , పార్కింగ్ ఛార్జీలు, అలాగే అనుభవజ్ఞుడైన టూర్ గైడ్ సేవలు అన్నీ కలిసి ఉంటాయి. బుకింగ్లు , మరిన్ని వివరాల కోసం ఆసక్తి గలవారు సమీపంలోని తెలంగాణ పర్యాటక శాఖ బుకింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సంస్థ కోరింది.

















