హైదరాబాద్ : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ బియ్యం మార్కెట్గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల నుండి చివరి గింజను కూడా కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతిపై మంత్రి నుంచి సరైన సమాధానం రాక పోవడంతో, తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి సరఫరాపై, ప్రేమ్చంద్ గార్గ్ను సలహాదారుగా నియమించడంపై వివరాలు కోరారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో సహా కేంద్ర ఏజెన్సీలు నమోదు చేసిన కేసులను గార్గ్ ఎదుర్కొంటున్నారని అన్నారు. బియ్యం ఎగుమతిలో కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు సభా కమిటీని ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మధ్యవర్తుల పాత్రను తొలగిస్తూ తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఇది ఒక చారిత్రాత్మక ఒప్పందం అని, ఇందులో ఎలాంటి కుంభకోణం లేదన్నారు.. రబీ పంట సమయంలో రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామన్నారు. కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు మంత్రి. నాణ్యమైన బియ్యంపై రైతులకు రూ.500 బోనస్ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ బోనస్ ఇచ్చేందుకు రూ.3,500 కోట్లు కేటాయించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

















