హైదరాబాద్ : తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని, జనసేన జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే స్తానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటామని అన్నారు. ఇక మన ముందు ఉన్నది మున్సిపల్ ఎన్నికలేనని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా లో జరగబోయే ఎల్లంపేట్, అలియబాద్, మూడు చింతల పల్లి మున్సిపాలిటీ ల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిమ్మకాయల పెద్దిరాజు, గరగ నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు, వీర మహిళలు సుమారు 150 మంది పార్టీ లో చేరినట్లు ఆయన తెలిపారు.పార్టీ లో చేరిన వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురవేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. పార్టీ లో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె. ఇబ్రహీం లతో పాటు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

















