చెన్నై : రాబోయే రోజుల్లో దేశంలోనే తమిళనాడు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో బలమైన శక్తిగా తయారు చేస్తామని ప్రకటించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. శనివారం చెన్నైలో అధికారికంగా జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు నటి త్రిష కృష్ణన్. సీఎం విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభ కూడా హాజరయ్యారు. అంతకు ముందు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గౌరవ వందనం పోలీసుల నుంచి స్వీకరించారు. పరేడ్ బృందాన్ని తనిఖీ చేయడానికి ముందు, ఉన్నత ప్రభుత్వ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంతో రాష్ట్ర 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. గౌరవ వందనం అనంతరం, ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేసి, స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, సాయుధ దళాల సభ్యులు, స్వాతంత్ర సమరయోధులు, ఆహ్వానితులైన ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర వారసత్వం, విజయాలను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్ బృందాలు కూడా ఈ వేడుకల్లో భాగంగా ఉన్నాయి. ఈ సందర్భంగా సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం స్వల్ప కాల వ్యవధిలోనే లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం జరిగిందన్నారు.
















