ఢిల్లీ : కావేరీ జలాలను విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని కోరుతూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ తమకు కేటాయించిన నీటి పరిమాణం, పొరుగు రాష్ట్రమైన కర్ణాటక విడుదల చేసిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. తమకు దక్కాల్సిన కావేరీ జలాల వాటాను తక్షణమే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఆగస్టు 17 నాటి కోర్టు జాబితా ప్రకారం ఈ అంశంపై జస్టిస్ విక్రమ్ నాథ్ , జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. తమిళనాడు ప్రభుత్వం , డీఎంకే పార్టీత పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను ఆగస్టు 17న విచారణకు స్వీకరిస్తామని అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 12న పేర్కొంది.
ఇదిలా ఉండగా వర్షపాతం తక్కువగా ఉన్న ఈ సంవత్సరంలో తమకు రావాల్సిన కావేరీ జలాల వాటా లభించడం లేదని తమిళనాడు ప్రభుత్వం గతంలోనే తెలిపింది. నీటిని తక్షణమే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జూలై 28న జరిగిన సీడబ్ల్యూఆర్సీ సమావేశం జూలై 29 నుండి 15 రోజుల పాటు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. అయితే, జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు బిలిగుండ్లు వద్ద విడుదలైన నీటి పరిమాణం 158 నుండి 550 క్యూసెక్కుల మధ్య మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని జలాశయాలైన కేఆర్ఎస్ కబిని, హరంగి , హేమావతిలలో కలిపి మొత్తం 77.537 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాబట్టి తమిళనాడుకు దక్కాల్సిన వాటాను దామాషా పద్ధతిలో విడుదల చేయడంలో కర్ణాటకకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
