గుంటూరు జిల్లా : ఏపీలో 10 , ఇంటర్ కోర్సులలో అత్యధిక మార్కులు సాధించిన కురమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు భారీ ఎత్తున ప్రతిభ అవార్డుల పేరుతో ప్రోత్సాహకాలను అందజేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. తన తండ్రి. మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డికి విద్య పట్ల మక్కువ ఎక్కువని తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది టెన్త్ లో ప్రభుత్వ పాఠశాలలో చదివి 550 పైబడి మార్కులు సాధించిన 24 మంది విద్యార్థులకు రూ.25 వేల చొప్పున ఆర్థిక భరోసా కల్పించినట్లు తెలిపారు ఎస్. సవిత. ఇంటర్ సెకండియర్ లో 950 పైబడి మార్కులు సాధించిన 70 మందికి రూ.50 వేల చొప్పున అందించామన్నారు. బీటెక్ విద్యార్థులకు లాప్ ట్యాప్ లు అందజేస్తున్నామన్నారు మంత్రి.
అంతకు ముందు విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు అందజేయడానికి వచ్చిన మంత్రి సవితకు కురమ సంక్షేమ సంఘ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సవిత స్థానిక విఘ్నేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం ప్రతినిధులు మర్రి వెంకట సత్యనారాయణ, తట్టి అర్జున రావు, ఎం.సత్యనారాయణ, బక్కా రామకృష్ణ, కార్పొరేటర్ ఎస్.శ్రీనివాసరావు, మర్రిపాటి రమేశ్, లంబు నాగేశ్వరరావు, వెంకట్రామయ్య, దన్నే అశోక్ తదితరులు పాల్గొన్నారు.
















