హైదరాబాద్ : దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులో మురుగు నీరు చేరి కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. చెరువు పరిసరాలను జలమండలిఎండీ అశోక్ రెడ్డి, ఈడీ సంతోష్, మున్సిపల్, హెచ్ఎండీఏ, లేక్స్, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల అధికారులు పరిశీలించారు. చెరువులో మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడానికి జాయింట్ ఇన్ స్పెక్షన్ నిర్వహించారు. రహేజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భవన నిర్మాణ, గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ అవసరాల కోసం ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటినే వాడుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
మాదాపూర్, సైలెంట్ వాలీ ప్రాంతాలు, క్యాచ్ మెంట్ ఏరియాలో ఉత్పన్నమవుతున్న మురుగు నీటిని.. జలమండలి దుర్గం చెరువులో నిర్మించిన రెండు ఎస్టీపీల (5 , 7 ఎమ్మెల్డీలు) ద్వారా శుద్ధి చేస్తున్నారు. దుర్గం చెరువు భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు, చెరువు హైడ్రాలజీ కాపాడేందుకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని చెరువులోకి వదిలి పెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అధికంగా వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా 1000 ఎంఎం డయా పైపులైన్ ను మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి మాదాపూర్ ఐ , డి వరకు ఉన్న పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. పైపులైన్ నిర్మాణం పూర్తయితే లేక్ పార్కులో జరుగుతున్న సీవరేజ్ ఓవర్ ఫ్లో కూడా తగ్గనుంది.
వర్షాకాలంలో వచ్చే వరద నీరు చెరువులో కలవకుండా వాటర్ డ్రైయిన్ సైతం పూర్తి చేయనుంది. చెరువు భూగర్భ జలాల స్థాయిలను కాపాడేందుకు ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని పార్కులో నిర్వహణ పనులకు, చెట్లు పెంచేందుకు ఉపయోగించాలని సూచించారు. రహేజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భవన నిర్మాణ, పార్కు, ల్యాండ్ స్కేప్ నిర్వహణకు ఇతర అవసరాలకు తప్పనిసరిగా వంద శాతం రీసైకిల్ వాటర్ నే వినియోగించాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ ప్రాజెక్టు సీజీఎంలు పద్మజ, వాస సత్యనారాయణ, మున్సిపల్, ఇరిగేషన్ ఈఈ, టీజీఐఐసీ ఎస్సీ, సీఈ, ఇతర తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
















