హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరు స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించు కోవాలని అన్నారు. అలాగైతేఏనే సినిమాలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బిగ్గెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ పరిశ్రమలోనేనని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ సినీ రంగంలో కలకలం రేపుతున్నాయి. స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకుని, డ్రగ్స్ తీసుకోవడం తప్పని చెప్తే, వారి అభిమానులు కూడా ఆ దారిలోనే నడుస్తారని అన్నారు.
ప్రతీ 90 రోజులకు ఒకసారి సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలి లేదంటే డ్రగ్స్ తీసుకున్నట్లేనంటూ బాంబు పేల్చారు అనిరుధ్ రెడ్డి. అంతే కాకుండా స్వంత సర్కార్ పై కూడా సీరియస్ కామెంట్స్ చేశారు.
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసా పేక్ తమాషా దేక్ నడుస్తోందన్నారు. పైసలు ఉన్నోడికి పనులు అవుతున్నాయన్నారు. పేదలు పనుల కోసం 10 సార్లు తిరుగుతున్నారని, దీని వల్ల తమకు చెడ్డ పేరు వస్తోందని వాపోయారు. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదు కానీ.. నేను సారా అంటే మాత్రం తప్పొచ్చిందా అని ప్రశ్నించారు.
సినిమా వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు.. రాజకీయ నాయకులు గ్లాసులు పట్టుకుంటే జీరోలా? అని ఫైర్ అయ్యారు. బాలకృష్ణ మామ ఏక్ పెగ్ లా అంటే, పవన్ కళ్యాణ్ మందు బాబులం అంటే యువకులు డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారని అన్నారు. సినిమాల్లో మందు తాగే సన్నివేశాలు లేకుండా సెన్సార్ బోర్డు కట్ చేయాలని డిమాండ్ చేశారు.
