తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. వచ్చే మార్చి నెలలో 3వ తేదీన చంద్ర గ్రహణం రానుందని తెలిపింది. ఈ సందర్బంగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా జారీ చేసిన ప్రకటనలో తెలియ చేసింది. గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసి వేయనున్నట్లు స్పష్టం చేసింది. 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది.
సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది టీటీడీ. సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహ వచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుందని స్పష్టం చేసింది టీటీడీ. .చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. ఇదిలా ఉండగా శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించు కోవాలని కోరింది.



















