తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో కీలక మార్పు చేసినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఇందులో భాగంగా జనవరి 9వ తేది నుండి ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కాగా ప్రస్తుతం తిరుమలలో ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే యథావిధిగా ఇప్పటికే అమలులో ఉన్న శ్రీవాణి దర్శన టికెట్ల అడ్వాన్స్ బుకింగ్, తిరుపతి విమానాశ్రయంలోని ఆఫ్ లైన్ కరెంట్ బుకింగ్ విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను ఈనెల 9వ తేద నుండి రోజువారి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించనున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్లోకి మార్చనున్నట్లు తెలిపారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతామని, టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.


















