తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలలో తిరుపతి లోని ప్రసిద్దమైన శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 06, 13, 20, 27 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం ఉంటుందని పేర్కొంది టీటీడీ. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారని తెలిపింది.
ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 04న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా అష్టోత్తర కలశాభిషేకం, తిరువీధి ఉత్సవం రద్దు చేసినట్లు తెలిపారు జేఈవో వి. వీరబ్రహ్మం. డిసెంబర్ 08న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఉంటుందని తెలిపారు, సాయంత్రం 5.30 గం.లకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారని పేర్కొన్నారు. డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు జేఈవో. డిసెంబర్ 19న ఉదయం 09.00 గం.లకు అమావాస్య, సరస్ర కలశాభిషేకం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు. డిసెంబర్ 30న వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నారు.


















