హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుసరించిన విధానం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు అంటేనే పార్టీ ఫిరాయించినట్టు కాదా అని ప్రశ్నించారు. ఇంతకు మించిన ఆధారాలు ఇంకేం ఉంటాయంటూ ప్రశ్నించారు కేటీఆర్.
మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో మీరు క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ లు ఇవ్వడం ఎంత వివాదాస్పదం అయ్యిందో లోకమంతా చూసిందన్నారు. అయినా ఆ విషయం మీ దృష్టికి రాలేదా?జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టి వేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ఇందుకోసమేనా మీరు స్పీకర్ గా ఉన్నది అంటూ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరు ఇలా అడ్డగోలుగా అసంబద్ద చర్యలకు దిగితే ఎలా అంటూ ఫైర్ అయ్యారు.
మీరు రాజ్యాంగ బద్దమైన స్పీకర్ చైర్ లో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలా? అదే నిజమైతే మీరు భారత రాజ్యాంగాన్ని, చట్ట సభల ఔన్నత్యాన్ని ఎలా కాపాడగలుగుతారని నిలదీశారు కేటీఆర్.
