అమరావతి : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ ప్రచారం పీక్స్ పరిపాలన వీక్ అంటూ ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. 24 నెలల పాలనా కాలంలో 24 మోసాలు జరిగాయన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత ఇదేనన్నారు. పాలనంతా మాయా బజార్ మోసం తప్పా జరిగింది ఏమీ లేదన్నారు. విజన్ లేదు విజ్డం అంతకన్నా లేదన్నారు. బాబు షూరిటీ లేదు.. భవిష్యత్ కి గ్యారెంటి లేదని పేర్కొన్నారు షర్మిలా రెడ్డి. పునర్ నిర్మాణం జరగలేదు..పునరంకితానికి దిక్కు లేదన్నారు. ఉద్దరిస్తారని అధికారమిస్తే రాష్ట్ర ప్రజలకు పెట్టినవి పెద్ద పంగనామాలు అని మండిపడ్డారు. కూటమి ఇచ్చిన హామీలు గంపెడు.. అమలు చేసింది చిటికెడు మాత్రమేననిపేర్కొన్నారు.
అబద్ధపు మాటలు చెప్పి, మ్యానిఫెస్టోపై మాట తప్పి, స్వర్ణాంధ్ర సాధన జరిగిందని, సుపరిపాలన సాగుతోందని, అభివృద్ధి, సంక్షేమం పేరిట విజయోత్సవ సభలు పెట్టడానికి కూటమి పార్టీలకు సిగ్గుండాలని అన్నారు ఏపీపీసీసీ చీఫ్. నిజాలు దాచి అబద్ధాలు ప్రచారం చేయడమంటే నైతికతకు నీళ్లు వదిలేయడమేనని ఆరోపించారు. గత రెండేళ్లుగా ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 15 వందలు ఇస్తామని చెప్పిన మహిళాశక్తి పథకానికి దిక్కు లేదన్నారు. 20 లక్షల ఉద్యోగాల జాడలేదు.. లేకుంటే ఇస్తామని చెప్పిన 3 వేల నిరుద్యోగ బృతికి గతి లేదని ఫైర్ అయ్యారు. మూడు సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి అంతా సగం సగమేనని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ ను సూపర్ ఫ్లాప్ చేసి, సూపర్ హిట్ అని చెప్పుకోవడం చంద్రబాబుకే సాధ్యం అన్నారు. చేసిన వాగ్దానాలకు విలువ లేదు . మ్యానిఫెస్టో 143 హామీల అమలుకు అతీ గతి లేదన్నారు.
మెగా డీఎస్సీ దగా డీఎస్సీ చేసి, జాబ్ క్యాలెండర్ ను జాబులు లేని క్యాలెండర్ గా మార్చారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఉన్న పెన్షన్లనే ఊడపీకారు. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రెండు లేదా మూడు సెంట్ల భూమి ఇస్తామని మాట తప్పారు. పక్కా ఇండ్లు కట్టిస్తామన్న హామీని తుంగలో తొక్కారన్నారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అటకెక్కించారని భగ్గుమన్నారు.

















