SBI Chairman : దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2024-25 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గణనీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే బ్యాంక్ ఏకీకృత నికర లాభం 10 శాతం పెరిగి రూ.21,201 కోట్లకు చేరింది. ట్రెజరీ లావాదేవీలు, విదేశీ మారకద్రవ్య కార్యకలాపాల లాభాలు ఈ వృద్ధికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
బ్యాంక్ స్టాండ్అలోన్ లాభం కూడా 12 శాతం పెరిగి రూ.19,160 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ లాభం రూ.17,035 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.1.22 లక్షల కోట్ల నుంచి రూ.1.35 లక్షల కోట్లకు చేరింది.
SBI Chairman – నికర వడ్డీ ఆదాయంలో స్వల్ప తగ్గుదల
కమర్షియల్ రుణాల విస్తరణ ఉండగా కూడా, బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) రూ.41,072 కోట్లకు తగ్గింది. ఇది ఏడాది ప్రాతిపదికన 0.13 శాతం తక్కువ. నికర వడ్డీ మార్జిన్ (NIM) 3.35 శాతం నుంచి 3.02 శాతానికి తగ్గింది. రెపోరేటు తగ్గింపులు, డిపాజిట్లపై వడ్డీ మార్పులు ఆలస్యం కావడం వడ్డీ ఆదాయంపై ప్రభావం చూపినట్లు చెబుతున్నారు.
ఎస్బీఐ చైర్మన్ (SBI Chairman) చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ, ప్రస్తుతం వడ్డీ మార్జిన్పై ఒత్తిడి ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికమేనని, రెండో త్రైమాసికం తర్వాత పునరుద్ధరణ కనిపించే అవకాశముందని పేర్కొన్నారు. సంవత్సరాంతానికి 3 శాతం NIM సాధించే లక్ష్యాన్ని ఎస్బీఐ కొనసాగిస్తుందన్నారు.
వడ్డీయేతర ఆదాయంలో గణనీయ వృద్ధి
ఈ త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీయేతర ఆదాయం 55 శాతం పెరిగి రూ.17,346 కోట్లకు చేరుకుంది. ఇందులో ఫారెక్స్ లావాదేవీల ద్వారా రూ.1,632 కోట్లు, పెట్టుబడుల విక్రయాల ద్వారా రూ.6,326 కోట్ల ఆదాయం లభించింది. నిర్వహణ వ్యయాలు రూ.27,874 కోట్లకు పెరిగినప్పటికీ, ఆదాయ వృద్ధితో లాభదాయకత మెరుగుపడింది.
రుణాలు, డిపాజిట్ల విస్తరణ
మొత్తం రుణాల వృద్ధి 11.6 శాతంగా నమోదైంది. ఇందులో కార్పొరేట్ రుణాలు 5.7 శాతం, దేశీయ రిటైల్ రుణాలు 12.56 శాతం, విదేశీ రుణాలు 14.5 శాతం పెరిగాయి. ప్రస్తుత సంవత్సరానికి 12 శాతం రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం రూ.7 లక్షల కోట్ల విలువైన రుణాలు పైప్లైన్లో ఉన్నాయని పేర్కొంది.
మొండి బాకీల స్థితిగతులు
స్థూల ఎన్పీఏ నిష్పత్తి 1.83 శాతంగా స్థిరంగా ఉంది. కొత్తగా రూ.7,945 కోట్ల రుణాలు మొండి బాకీల జాబితాలోకి చేరాయి. బ్యాంక్ రూ.4,759 కోట్లను ప్రొవిజన్లకు కేటాయించింది.
అనుబంధ సంస్థల పనితీరు
- ఎస్బీఐ లైఫ్: లాభం రూ.549 కోట్లు
- ఎస్బీఐ కార్డ్: లాభం రూ.556 కోట్లకు తగ్గింపు
- ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్: లాభం రూ.188 కోట్లు
బీఎస్ఈలో శుక్రవారం ఎస్బీఐ షేరు రూ.804.55 వద్ద ముగిసింది, ఇది గత ముగింపు కన్నా 0.09 శాతం తగ్గుదల.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం లేనట్టు చెబుతున్న ఎస్బీఐ
ట్రంప్ విధించిన తాజా సుంకాల వల్ల ప్రభావితమవుతున్న 4-5 రంగాలకు మాత్రమే బ్యాంక్ రుణాలిచ్చిందని, వీటి వాటా మొత్త రుణాల్లో 2 శాతం లోపే ఉన్నందున ఎలాంటి ప్రభావం లేకపోవచ్చని చైర్మన్ స్పష్టం చేశారు. మూడో త్రైమాసికంలో అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గే అవకాశం ఉందని ఎండీ అశ్వినీ కుమార్ అభిప్రాయపడ్డారు.
Also Read : New Income Tax Bill 2025 : పాత ఇన్కమ్ బిల్లును వెనక్కి తీసుకున్న భారత్ సర్కార్


















