దుబాయ్ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు సంబంధించి నామినీ జాబితాలో ఇండియన్ స్టార్ ప్లేయర్లు సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026లో అసాధారణమైన ప్రతిభను కనబర్చారు బ్యాటింగ్ పరంగా సంజు శాంసన్, బౌలింగ్ పరంగా జస్ప్రీత్ బుమ్రా. టోర్నమెంట్లో శాంసన్ ప్రదర్శించిన అద్భుతమైన ఆటతీరు, అతనికి వరుసగా రెండు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులను తెచ్చిపెట్టడమే కాకుండా, ఐసీసీ పురుషుల T20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ 20లో చోటు దక్కేలా చేసింది.
ఇదిలా ఉండగా ఐసీసీ మార్చి 2026 నెలకు సంబంధించిన పురుషుల ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినీల జాబితాను ప్రకటించింది. శాంసన్ , బుమ్రాతో పాటు దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన వర్ధమాన తార కానర్ ఎస్టర్ హుయిజెన్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం పోటీ పడుతున్నారు. వరల్డ్ కప్ టోర్నీలో శాంసన్ కు తొలి నాలుగు మ్యాచ్ లలో చోటు దక్కలేదు. కానీ ఆ తర్వాత 5 మ్యాచ్ లు ఆడి 321 రన్స్ చేశాడు. ఇండియా విశ్వ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టులో చేరిన తర్వాత మాత్రం, ప్రపంచ వేదికపై అతను తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా తన సొంతం చేసుకున్నాడు. ఇక బుమ్రా సైతం కీలకమైన వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.



















